పాక్‌ నిర్ణయాలపై కామెడీ

ఆర్థిక నష్టం వాటిల్లిందంటూ పరోక్షంగా అజిత్‌దోవల్‌ వ్యంగ్యాస్త్రాలు

న్యూఢిల్లీ: 
పాకిస్తాన్‌ భారత్‌తో వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకుందని, ఈ నిర్ణయంతో భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని దోభాల్‌ ట్వీట్‌ చేశారు. ఎంత నష్టమంటే.. విరాట్‌ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రాంలో ఒక వాణిజ్య ప్రకటన పోస్ట్‌ చేయాలంటే ఎంత వసూలు చేస్తాడో అంత నష్టం జరిగిందని.. ఇది చాలా బాధాకరమని.. ఈ భారీ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలని దోవల్‌ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘భారత్‌తో వాణిజ్యం బంద్‌’ అని పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయాన్ని అజిత్‌ దోవల్‌ కూరలో కరివేపాకులా తీసిపడేశారు. ఈ నిర్ణయం వల్ల భారత్‌కు వచ్చిన నష్టమేమీ లేదనేది ఆయన అభిప్రాయం గా భావించవచ్చు. 
కాగా కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపతి కల్పించే ‘ఆర్టికల్‌ 370’ను భారత్‌ రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌ కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకోవడం, సంఝౌత ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత, భారతీయ సినిమాల బహిష్కరణ ఇలా పలు నిర్ణయాలతో పాకిస్తాన్‌ పరిస్థితిని మరింత జటిలంగా మార్చే స్థితికొచ్చింది. అయితే.. పాకిస్తాన్‌కు ఒక్క చైనా తప్పిస్తే మరే దేశం మద్దతు తెలిపే పరిస్థితి కనిపించడం లేదు. పాకిస్తాన్‌ వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవడం వల్ల భారత్‌కు పెద్ద నష్టమేమీ లేదని ఇప్పటికే ఆర్థిక నిపుణులు స్పష్టం చేశారు. ఇదే విషయంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంటూ పాక్‌ తీసుకున్న నిర్ణయంపై తనదైన రీతిలో స్పందించారు. పాక్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.