అయోధ్యలో విధ్వంసానికి పాకిస్తాన్ ఐఎస్ఐ పన్నాగం :: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక

లఖ్‌నవూ: భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా  ఆగస్టు 5న అయోధ్యలో  రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను జరిపేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసి  విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అయోధ్య, దిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తనిఖీలు ముమ్మరం చేశాయి. అయోధ్యలో హై అలర్ట్‌ ప్రకటించారు. అయోధ్యలో భూమి పూజ నిర్వహించబోయే రోజు, జమ్మూకశ్మీర్‌ ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన రోజు ఆగస్టు 5 కావడం వలన భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా భాజపా అగ్రనేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీమనోహర్‌ జోషీ, ఉమా భారతితో పాటు ఆరెస్సెస్‌ అగ్ర నేతలు, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని హెలికాప్టర్‌‌ దిగే సాకేత్‌ మహా విద్యాలయం నుంచి రామ జన్మభూమి స్థలం వరకు  భద్రతా దళాలు ఇప్పటికే మోహరించాయి. అలాగే, రామ్‌కోట్‌ ప్రాంతములోని నివాసితుల రాకపోకలకు చెందిన  ప్రత్యేక పాస్‌లను కూడా జారీ చేశారు. అలాగే, రోజూ భద్రతా బలగాలు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తూ ఇంటింటి తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఆ ప్రాంతంలో డ్రోన్‌ కెమెరాలతో  ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు.