అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చట్టవిరుద్ధమైన అరెస్టులు, వేధింపులు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు. ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ, పరిరక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో ప్రస్తావించారు. అక్రమ నిర్బంధాలు, చట్టవిరుద్ధమైన అరెస్టులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. ‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను అధికార పార్టీ హరించేస్తోంది. సోషల్ మీడియా వేదికగా పోలీసులు అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అని చంద్రబాబు తన లేఖలో వివరించారు.