మున్సిపోల్స్కు ముందే కార్యకర్తల్లో పెరిగిన ఉత్సాహం
- -దిశ నిందితుల ఎన్కౌంటర్తో జాతీయ స్థాయి ఖ్యాతి
- -తెలంగాణ పోలీసులతో సహా, సీఎంపైనా ప్రశంసల వెల్లువ
- -నిర్బయ హత్య కేసులో ఇంకా నాన్చుతున్న కేంద్రం
- -మొన్నటి ఉన్నావ్ సంఘటనతో కేంద్రంపై ప్రజాగ్రహం
- -సరిగ్గా అదును చూసి జరిగిన ఎన్కౌంటర్ సంఘటన
- -జాతీయ స్థాయిలో హీరోలుగా సజ్జనార్, కేసీఆర్లు
- -సోషల్ మీడియాలోనూ ఆకాశానికెత్తేస్తున్న నెటిజెన్స్
- -నిన్నటిదాకా సీఎంని విమర్శించిన ప్రతిపక్షాలు
- -సీఎం వ్యూహంతో అవాక్కయిన విపక్షాలు
హైదరాబాద్:
దిశ సంఘటన దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ప్రతిపక్షం, పాలకపక్షం అనే తేడా లేకుండా అందరూ ముక్తకంఠంతో దాన్ని ఖండించారు. అయితే గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఈ సంఘటనపై ఆలస్యంగా స్పందించారు. దీనితో ప్రతిపక్షాలు దీన్ని సాకుగా తీసుకుని సీఎంని ఇరుకునపెడదామనుకున్నాయి. అసలే ఆర్టీసీ లొల్లితో కుదేలైన కేసీఆర్ తెలివిగా జఠిలమైన సమస్యను ఓ కొలిక్కి తెచ్చారు. అక్కడ తన చాణిక్య నీతితో తెలివిగా నెట్టుకొచ్చారు. తర్వాత అనుకోని సంఘటనలా దిశ దుర్ఘటన దుమారం రేపింది. ఇక్కడా సీఎంని దోషిని చేసి మాట్లాడారు. సాధారణ పౌరులు కూడా సీఎంను తప్పుపట్టారు. ఒక్కసారిగా ప్రజల నాడి గ్రహించి తెర వెనుక సూత్రధారిగా సీఎం ఆదేశాలివ్వడం..తూ.చ.పోలీసు అధికారులు పాటించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఫలితం…దిశ నిందితులను మట్టుబెట్టడం…జనాలలో సర్వత్రా హర్షం..దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిశాయి. హఠాత్తుగా సీఎం కేసీఆర్ సైతం జాతీయ స్థాయిలో హీరో అయిపోయారు. ఈ నెలలోనే మునిసిపల్ ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నారు అధికారులు. ఈ దెబ్బతో కేసీఆర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయి విపక్షాలను ఊపిరి పీల్చుకోలేని స్థితికి వచ్చింది.
సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ను మించి రాజకీయ చతురత.. వ్యూహ చతురత మరొకరికి లేదని రాజకీయ ఉద్దండులు చెబుతున్నారు. రాల్లేసిన వారితోనే పూలు కురిపించుకునే ఘనత కేసీఆర్ సొంతమని చెప్పవచ్చు. తాజాగా ఆర్టీసీ సమ్మె విషయంలోనూ.. దిశ ఎన్కౌంటర్ విషయంలోనూ కేసీఆర్ వ్యూహాలు మామూలు జనాలనే కాక, రాజకీయ దిగ్గజాలను కూడా ఆశ్చర్యపరిచాయి. కేసీఆర్ ను తీవ్రంగా తిట్టిన ఆర్టీసీ కార్మికులతోనే కేసీఆర్ చప్పట్లు కొట్టించుకున్నారు. జై కేసీఆర్ అని నినదించేలా చేశారు.
ఇక దిశ హత్యోదంతంలో తెలంగాణ సర్కారును, కేసీఆర్, తెలంగాణ పోలీసులను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు, సంఘాలు, ఇతర జాతీయ మీడియా కూడా తూర్పారబట్టాయి. ఇప్పుడు దిశ హంతకుల ఎన్ కౌంటర్ తో తిట్టిన వారితోనే కేసీఆర్ శభాష్ అనిపించుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఒక్క ఎన్ కౌంటర్తో కేసీఆర్ ఓవర్ నైట్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు దేశంలో ముఖ్యంగా యూపీలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇదే శరాఘాతంగా మారింది. బీజేపీ హయాంలోనే దేశంలో అత్యాచారాలు, హత్యలు, దమనకాండలు పెట్రేగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవలే యూపీలోని ఉన్నావ్ లో అత్యాచార బాధితురాలిని కాల్చిచంపేశారు. ఆమె మరణ కారకులను ఇలాగే ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. కేసీఆర్ చేసిన పనితో ఇప్పుడు మోడీ ఇరుకునపడుతున్నారు.
పెను సంచలనంగా మారిన దిశ హత్యాచార ఉదంతం.. ఇది జరిగిన తొమ్మిది రోజులకే దిశ నిందితులు నలుగురు పోలీసుల ఎన్ కౌంటర్ లో హతం కావటం తెలిసిందే. ఈ ఉదంతంపై ప్రజల్లోనూ పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు సైతం ఈ ఉదంతంపై రెండుగా చీలిపోయారు. ఎన్ కౌంటర్ ను సమర్థించి.. స్వాగతించే వారు ఒక పక్షమైతే..విభేదించి వ్యతిరేకించేవారు మరో వర్గమయ్యారు. కాకుంటే.. మొదటి వర్గం కోట్లాదిగా ఉంటే.. రెండో వర్గం వారు మాత్రం గుప్పెడు మందే కావటం గమనార్హం.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. దిశ హత్యాచార ఉదంతం జరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచో పలువురు ప్రముఖులు దిశ తల్లిదండ్రుల్ని పరామర్శించేందుకు రాగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పరామర్శ కోసం దిశ ఇంటికి వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో జరిగిన హై ప్రొఫైల్ పెళ్లికి వెళ్లటం.. తర్వాత హైదరాబాద్లో జరిగిన మరో విందుకు కోసం హాజరుకావటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఢిల్లీలోని వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును జాతీయ మీడియా.. సోషల్ మీడియాలలో ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఎప్పటిలానే కామ్ గా.. జరుగుతున్న పరిణామాల్ని చూస్తూ ఉన్నారే తప్పించి స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్ తో ప్రజలు విపరీతమైన ఆనందాన్ని ప్రదర్శించారు. బాణసంచా కాల్చి.. స్వీట్లు పంచుకొని.. పూలాభిషేకాలు.. పాలాభిషేకాలతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
దిశ హత్యాచార ఉదంతంలో సీఎం కేసీఆర్ పాలనా తీరును పలువురు తప్పుపడితే.. తాజాగా చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. చివరకు మాయావతి లాంటోళ్లు సైతం తెలంగాణలో జరిగింది చూసి నేర్చుకోండంటూ యూపీ పోలీసులకు చురకలు అంటించారు. ఏ ఉదంతంతో తనకు తీరని డ్యామేజీ జరిగిందో.. ఇప్పుడు దానికి మించిన ఇమేజ్ బిల్డింగ్ కు దిశ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేందుకు వెళితే.. ప్రజల్లోరియాక్షన్ బ్రహ్మాండంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దిశ ఇంటికి కేసీఆర్ కానీ వెళితే.. నా సామి రంగా అన్న రేంజ్లో ఇమేజ్ పెరుగుతుందంటున్నారు. ఈ వాదనల నేపథ్యంలో కేసీఆర్ సన్నిహితులకు పలువురి వద్దా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దిశ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేందుకు సీఎం కేసీఆర్ వెళతారా? అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎప్పుడేం చేయాలో బాగా తెలిసిన సీఎంకు.. దిశ తల్లిదండ్రులను పరామర్శించేందుకు గులాబీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
హైదరాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశపై జరిగిన హత్యాచార ఉదంతం దేశాన్ని ఎంతలా కదిలించి వేసిందో చెప్పాల్సిన అవసరమే లేదు. దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దిశ హత్య జరిగిన తొమ్మిదో రోజున.. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు హతం కావటం మరో సంచలనంగా మారింది. దారుణమైన నేరానికి పాల్పడిన వారికి సరైన శిక్ష విధించారని ఎన్ కౌంటర్ పై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. దిశ నిందితులకు సరైన శిక్ష పడింది సరే..? అప్పుడెప్పుడో నిర్భయ ఉదంతంలో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించినా.. ఇప్పటివరకూ ఎందుకు రియాక్ట్ కాలేదు? అని ప్రశ్న అంతకంతకూ పెరుగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో నిర్భయ ఉదంతం మరోసారి తెర మీదకు రావటమే కాదు.. ఆ రాక్షసులకు చట్టబద్ధంగా అమలు చేయటానికి కూడా మరీ ఇంత ఆలస్యమా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే సమయంలో అత్యాచార దోషులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష అన్నది లేదని రాష్ట్రపతి కోవింద్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ఖాయమంటున్నారు. దోషులను చట్టప్రకారం శిక్షించేందుకు సాగుతున్న ఆలస్యంపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న వారిని శాంతింపజేసేందుకు నిర్భయ దోషులకు ఏ క్షణంలో అయినా ఉరి అమలు చేయొచ్చని తెలుస్తోంది. నిర్భయ ఉదంతంలోని దోషుల్లో ఒకరు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా నిన్నటి వరకూఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉరిశిక్షను అమలు చేసేందుకుచర్యల్ని వేగవంతం చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏ క్షణంలో అయినా ఉరిని అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు నిర్భయ తల్లి సైతం స్పందిస్తూ.. దిశ నిందితులకు శిక్ష పడితే.. దుర్మార్గం జరిగిన ఏళ్లకు ఏళ్లు గడిచినా.. నిర్భయ దోషులకు మాత్రం శిక్షలు అమలు కావట్లేదన్న ధర్మాగ్రహాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఆమె గొంతుకు లక్షలాది గళాలు తోడవుతున్న వేళ.. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు దగ్గర్లోనే ఉందంటున్నారు.