కాఫీ షాపుల్లో డ్రగ్స్‌!

నగరంలో యథేచ్ఛగా మందుల షాపులు, చాయ్‌ అడ్డాల్లో మాదక ద్రవ్యాలు
  • -రూట్లు మారుస్తున్న అక్రమార్కులు
  • -పబ్బులు, క్లబ్బులపై నిఘా..
  • -వేరే మార్గంలో డ్రగ్స్‌ అమ్మకాలు
  • -స్కూళ్లు, కాలేజీల వద్ద అమ్మకాలకు స్వస్తి
  • -ఇప్పుడు చిన్న చిన్న దుకాణాలే అడ్డాలు
  • -కొరవడిన సర్కారు నిఘా
  • -నామమాత్రంగా దాడులు

హైదరాబాద్‌:
దేశంలోని కొన్ని ప్రధాన నగారాల్లో డ్రగ్స్‌ వాడకం వ్యవహారాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్‌లో అయితే పెద్ద పెద్ద డ్రగ్స్‌ రాకెట్స్‌ పట్టుపడ్డాయి. రెండేళ్ల కిందట పలువురు సినిమా తారలు డ్రగ్స్‌ వినియోగదారులుగా వెలుగులోకి వచ్చారు. వారందరి గుట్టూ బయటపడింది. వారిని పోలీసులు విచారణకు పిలిపించారు. మొదట్లో సంచలనం రేపిన ఆ అంశం ఆ తర్వాత తెర మరుగు అయ్యింది. డ్రగ్స్‌ వినియోగదారులు అయిన సినిమా వాళ్లు ఆ కేసుల నుంచి బయటపడినట్టే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ సంగతలా ఉంటే.. హైదరాబాద్‌లోని కొన్ని స్కూల్స్‌ను డ్రగ్స్‌ మాఫియా టార్గెట్‌ చేసుకుంటోందనే టాక్‌ కూడా అప్పట్లోనే వినిపించింది. ఆ వ్యవహారం పైనా పోలీసులు ఏమీ తెమల్చలేదు. ఇక ఇప్పటికీ నగరంలో డ్రగ్స్‌ పంపిణీ సాగుతూ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న కాఫీ షాపులను మాధ్యమాలుగా వాడుకుంటూ కొన్ని ముఠాలు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయని తెలుస్తోంది.
గరంలోని పలు మెడికల్‌ దుకాణాల్లో మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్న యువత వీటిని సేకరించేందుకు నగర శివారు ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. శివారు ప్రాంతాలైన నార్సింగ్‌, గచ్చిబౌలి, మొయినాబాద్‌, శామీర్‌పేట్‌, బాచుపల్లి, ఘట్‌కేసర్‌, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలలోని అటవీ ప్రాంతాల్లో డ్రగ్స్‌ను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు శివారు ప్రాంతాల్లో ఉన్న రిసార్టుల్లో రూములను తీసుకొని అక్కడే డ్రగ్స్‌ సేకరిస్తున్నారు. రిసార్టు నిర్వాహకులు కూడా వీరికి అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మత్తు పదార్థాలను సేకరిస్తున్న వారిలో ప్రధానంగా విద్యార్థులే ఉంటున్నారు.
డీల్‌ కోడ్‌
మెడికల్‌ దుకాణం దగ్గర డ్రగ్స్‌ కొనుగోలు చేయడానికి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఇవ్వరు. కేవలం దానికి సంబంధించిన కోడ్‌ భాష చెప్పిన వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌కు బానిసైన యువత ఈ మత్తు పదార్థాల కోసం గంటల తరబడి కూడా మెడికల్‌ దుకాణాల దగ్గర వేచి ఉంటున్నారు. మెడికల్‌ దుకాణాల్లో తక్కువ మొత్తం స్టాక్‌ ఉంచుకుంటటూ అధిక మొత్తం స్టాక్‌ను ఇళ్లలో ఉంచుకుంటూ అవసరం కొద్దీ తెచ్చుకుంటున్నారు. వాటి ద్వారా అమ్మకాలు సాగిస్తే ఎవరికి అనుమానాలు రావని డ్రగ్స్‌ సరఫరా ముఠాలు వాటిని ఉపయోగించుకుంటున్నట్టుగా టాక్‌. డ్రగ్స్‌ విషయంలో ఎక్సైజ్‌ అధికారులు కొన్ని రోజుల పాటు సీరియస్‌ గా ఉన్నట్టుగా హడావుడి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ నెలలు – సంవత్సరాల తరబడి అందుకు సంబంధించి అప్‌ డేట్స్‌ ఉండవు. ఎందుకు అలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. తెరచాటుగా డ్రగ్స్‌ అమ్మకాలు మాత్రం సాగుతూనే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరీ ఇప్పుడు అధికారులు ఎలా స్పందిస్తారో!
మహా నగరం డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందనే విషయం మరోసారి రుజువైంది. కొద్దికాలం అక్రమ రవాణా తగ్గినట్టు భావించినా చాపకింద నీరులా సాగు తుందనే వాస్తవం విస్మయానికి గురిచేస్తోంది. హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకుని నైజీరియన్ల ముఠా కోట్లాదిరూపాయల వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏడెనిమిదేళ్ల క్రితం మాదకద్రవ్యాల రవాణాలో కీలకపాత్ర వహించిన నిందితులు తిరిగి.. దాన్నే వ త్తిగా మలచుకున్నట్టు పోలీసులకు పట్టుబడిన నైజీరియన్లే ఇందుకు నిదర్శనం. గతంలో పలుమార్లు అరెస్టయిన వీరి కదలికలపై నిఘా ఉంచటకపోవటం కలిసొచ్చింది. నిఘా లేమిని అవకాశంగా మలచుకొని మాఫియా మరింతగా రెచ్చిపోయింది. అప్పట్లో కేవలం డ్రగ్స్‌ అమ్మకాలకు ఉపయోగించుకునే భాగ్యనగరాన్ని.. ప్రస్తుతం డెన్‌గా మలచుకున్నారు. ఇక్కడి నుంచే గోవా, ఢిల్లీ, ముంబయ్‌ వంటి నగరాలకు రవాణా చేస్తున్నారు.
రెట్టింపు ధర
కొకైన్‌.. హెరాయిన్‌.. బ్రౌన్‌షుగర్‌.. ఎల్‌ఎస్‌డీ.. ఏ పేరైనా.. మత్తులో ముంచటమే వీటి నైజం. సరదాగా మైకంలో పడేసి బానిసలుగా మార్చటమే మాదకద్రవ్యాల మాఫియా లక్ష్యం. హైటెక్‌ నగరంలో వీకెండ్‌ పార్టీలంటే ఫుల్‌జోష్‌. సెలవు రోజుల్లో పార్టీలు, పబ్‌లు, హోటల్స్‌లో ఎంజాయ్‌ చేయటం ఇక్కడ కామన్‌. ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో రేవ్‌ పార్టీలకు శివారు ప్రాంతాలే కేంద్రాలు. ఆ సమయాల్లో కేవలం ఆనందాన్ని ఆస్వాదించటమే.. కార్పొరేట్‌ ఉద్యోగులు, సంపన్నవర్గాల టార్గెట్‌. దీన్ని అవకాశంగా చేసుకుని.. ఎంజాయ్‌మెంట్‌లో డ్రగ్స్‌ వాడకాన్ని ప్రోత్సహించారు. అది క్రమేణా.. అలవాటుగా మారి ప్రస్తుతం బానిసలుగా మార్చింది. సుమారు లక్షమంది మత్తుకు బానిసలైన వారు ఉండొచ్చని ఓ పోలీసు అధికారి అంచనా వేశారు. పాకెట్‌మనీ, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలతో కుర్రకారు వద్ద డబ్బుకు లోటులేకుండా పోయింది. 2000-5000 ఖర్చుచేయటం తేలికైంది. మెట్రో నగరాల్లో ఎక్కడా దొరకని ఆదాయం.. డ్రగ్స్‌ ఏజెంట్లుకు ఇక్కడ దొరుకుతుంది. ఆఫ్రికా నుంచి కొకైన్‌, బ్రౌన్‌షుగర్‌ గ్రాము 500-1000కి గోవా చేరుతుంది. అక్కడి నుంచి మెట్రో నగరాల్లో గ్రాము రూ. 2000, 2200, 2800, 3000 వరకు ఏజెంట్లు బేరం బెడతారు. ఢిల్లీ, ముంబయ్‌ వంటి నగరాల్లో గ్రాముకు 500-600 మాత్రమే లాభం వస్తుంది. హైదరాబాద్‌లో గ్రాముకు 2000-3000 వరకూ రాబడి వస్తుంది. తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ లేకపోవటం వీరికి మరింత కలిసొస్తుంది. ఏడాదిన్నరగా నైజీరియన్ల ముఠా టోలీచౌకిలో ఉంటూ అక్రమాలు సాగిస్తున్నా పోలీసులు పసిగట్టలేకపోయారు.
కోడ్‌ భాషలో ప్యాకెట్‌పై ఆనవాళ్లు
ఈ-కామర్స్‌ పుణ్యమా అంటూ ఆన్‌లైన్‌ సేవలు చేరువయ్యాయి. డ్రగ్స్‌ సరఫరాలోనూ ఏజెంట్లు దీన్నే ఫాలో అవుతున్నారు. వాట్సప్‌ ద్వారా ఆర్డర్‌ రాగానే.. అందమైన ప్యాకింగ్‌తో గమ్యానికి చేర్చుతున్నారు. కళాశాల విద్యార్థులకు.. కొరియర్‌ బాయ్స్‌గా డెలివరీ చేస్తున్నారు. నోట్‌బుక్స్‌, టెక్ట్స్‌బుక్స్‌ రూపంలో.. ఏ పేజీలో సరుకు ఉందనేది కోడ్‌ భాషలో ప్యాకెట్‌పై ఆనవాళ్లు పంపుతారు. అలవాటుపడిన విద్యార్థులనే ఏజెంట్లుగా మార్చుతారు. కమీషన్‌, ఫ్రీగా మైకం వస్తుందనే ఆశతో తేలిగ్గా మాయగాళ్ల వలలో చిక్కుతున్నారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు డ్రగ్స్‌ చేరవేసేందుకు బస్సు, రైలు మార్గాలను ఉపయోగించుకుంటున్నట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. పట్టుబడిన నైజీరియన్లు ఇచ్చిన సమాచారంతో మరో భారీ డ్రగ్‌ రాకెట్‌ను ఛేదించేందుకు టాస్క్‌ఫోర్స్‌ సన్నద్ధమైనట్టు సమాచారం. నైజీరియా టు గోవా వయా హైదరాబాద్‌ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: బిజినెస్‌ వీసాపై భారతదేశం వచ్చారు. రెడీమేడ్‌ దుస్తులు ఎగుమతి చేస్తున్నామంటూ మస్కాకొట్టారు. వ్యాపారం ముసుగులో మెట్రోనగరాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని నైజీరియన్లు సాగిస్తున్న డ్రగ్స్‌ దందాను నగర యాంటీ నార్కోటిక్‌ సెల్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టబయలు చేశారు. ఏడుగురు నైజీరియన్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 73 గ్రాముల కొకైన్‌, 5 గ్రాముల బ్రౌన్‌షుగర్‌ స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.లింబారెడ్డి, యాంటీ నార్కోటిక్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి వివరాలు వెల్లడించారు.
రాఫెల్‌.. డ్రగ్‌ మాఫియా కింగ్‌
ఏజెనా రాఫెల్‌ ఛిడెరా(36) డ్రగ్స్‌ అక్రమ రవాణా సూత్రధారి. గతేడాది అక్టోబర్‌లో బిజినెస్‌ వీసాపై ముంబయ్‌ వచ్చాడు. రెడీమేడ్‌ దుస్తులను నైజీరియా ఎగుమతి చేస్తుండేవాడు. గోవా కేంద్రంగా మాదక ద్రవ్యాల సరఫరా ప్రారంభించాడు. స్థానికంగా తమ దేశస్థులనే ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని భారీగా డ్రగ్స్‌ విక్రయించేవాడు. దేశంలోని ప్రధానమైన హైదరాబాద్‌, ముంబయ్‌ తదితర మెట్రోనగరాలకూ డ్రగ్స్‌ రవాణా చేసేందుకు స్కెచ్‌ గీశాడు. పాత నెట్‌వర్క్‌లో పనిచేసిన వాళ్లను ఏజెంట్లుగా మార్చుకున్నాడు. పెద్దఎత్తున కమీషన్‌ ఆశచూపి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. భాగ్యనగరంలో డ్రగ్స్‌ వాడేవాళ్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడికి మకాం మార్చాడు. ఎక్కడా లేనంత పెద్ద మార్కెట్‌.. ఎంత ధరకైనా కొకైన్‌ కొనేవారు ఇక్కడే ఉండటం వారికి బాగా కలిసొచ్చింది.
కొకైన్‌, బ్రౌన్‌షుగర్‌ గ్రాము ధర రూ. 2800- 3000కు ఏజెంట్లకు అందించేవాడు. మార్కెట్‌లో రూ.5000-6000కు కొనుగోలుదారులకు విక్రయించే వారు. మూడు ప్యాకెట్లు.. ఆరు స్టాంప్స్‌గా రాబడి పెరిగింది.
జైలు కెళ్లొచ్చినా..
అనోరా(32), సాల్మన్‌(29), పీటర్‌(23), శామ్‌సన్‌ (29), క్రిస్టియన్‌ ఛుకు(35), ఉజోర్‌ ప్రామిస్‌(32) వీరంతా డ్రగ్‌ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు. వ్యాపారంలో నష్టపోయిన అనోరా మాదక ద్రవ్యాల సరఫరా వత్తి ఎంచుకున్నాడు. గోవా వచ్చే విదేశీ పర్యాటకులకు పెద్ద ఎత్తున హెరాయిన్‌ విక్రయిస్తూ కీలకంగా వ్యవహరించాడు. సాల్మన్‌ కూడా ఆఫ్రికన్‌ ఆహార పదార్థాలను అక్కడే విక్రయిస్తుండే వాడు. వచ్చే సంపాదన చాలక పెడదారి పట్టాడు. రెడీమేడ్‌ వస్త్ర ఎగుమతుల్లో నష్టపోయిన పీటర్‌ది అదే దారి.
గంజాయికి అలవాటుపడిన శామ్‌సన్‌ తర్వాత ఏజెంట్‌గా మారాడు. పోలీసులకు పట్టుబడిన నిందితులపై 2012-15 సంవత్సరం వరకూ నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లలో డ్రగ్స్‌ సరఫరా చేస్తూ పట్టుబడినట్టు కేసులు నమోదయ్యాయి. జైలుకెళ్లొచ్చినా మళ్లీ డ్రగ్స్‌ సరఫరాలో ఆరితేరారు.