శుభశ్రీ మతిపై హైకోర్టు సీరియస్‌

ఫ్లెక్సీల ఏర్పాటుపై మండిపాటు…అధికారులపై చర్యలకు ఆదేశాలు

చెన్నై : రాష్ట్రంలో అడ్డు ఆపూ లేకుండా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రోంపేటలో రోడ్డు మీడియన్‌లో అన్నాడీఎంకే నేత తరపున ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ గురువారం సాయంత్రం ఊడి పడిన ఘటనలో శుభశ్రీ (23) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ట్యాంకర్‌ లారీ చక్రాల కింద పడడంతో మ తి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ప్రమాదంపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్లెక్సీల ఏర్పాటుపై ఇదివరకే కోర్టు ఇచ్చిన ఐదు రకాల ఉత్తర్వులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వంపై, కార్పొరేషన్‌ కమిషనర్‌, ఇతర అధికారులపై మండిపడింది. ఈ ప్రమాదాన్ని సూమోటోగా పరిగణించి విచారణ జరపాలన్న న్యాయవాదులు లక్ష్మీనారాయణన్‌, కన్నదాసన్‌లు న్యాయస్థానాన్ని అభ్యర్థించగా, ఫ్లెక్సీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసునే పరిగణనలోకి తీసుకుని కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కేసుగా విచారణ జరుపుతామని న్యాయమూర్తులు సత్యనారాయణన్‌, శేషసాయి ప్రకటించారు. ఆ సందర్భంగా న్యాయమూర్తులు శుభశ్రీ మ తిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ‘మనిషి ప్రాణాలకు విలువలేకుండా పోయిందని, రహదారులపై ప్రవహిస్తున్న మనిషి రక్తాన్ని ఎంతకాలం తాగుతారు? ఆ యువతి కుటుంబానికి నష్టపరిహారం ఇస్తే సరిపోతుందా? ఆమె ప్రాణాలను తిరిగి తెచ్చివ్వగలరా?’ అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కార్పొరేషన్‌, పోలీసు శాఖ ఉన్నతాధికారులు తమ ఎదుట హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
న్యాయవాదులు లక్ష్మీనారాయణన్‌, కన్నదాసన్‌ తమ వాదనలు వినిపిస్తూ.. పళ్ళికరణై ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌ జారిపడటం వల్ల శుభశ్రీ అనే యువతి బలైందని, పోలీసులు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని, బ్యానర్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తిని విడిచిపెట్టారని ఆరోపించారు. అందుకు న్యాయమూర్తులు స్పందిస్తూ, ఫ్లెక్సీలు ఏర్పాటుపై ఇప్పటికే న్యాయస్థానం పలు ఉత్తర్వులిచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులను ఇలాగే ఉల్లంఘిస్తూ ఉంటే రాష్ట్ర సచివాలయాన్నే న్యాయస్థానంగా మార్చేస్తాం అనే ఉత్తర్వు తప్ప అన్ని రకాల ఆదేశాలు జారీ చేశామన్నారు. రాజకీయ పార్టీల నేతలను సంతోషపెట్టడానికి పార్టీశ్రేణులు నిబంధనలు ఉల్లఘించి రహదారికి అడ్డంగా, ట్రాఫిక్‌కు అంతరాయంగా ఫెక్సీలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారిందన్నారు. బ్యానర్ల వల్ల మ తిచెందినవారి కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం 2 లేదా 3 లక్షల పరిహారం ప్రకటించడంతో సరిపెట్టుకుంటోందని, సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతుందని ఆరోపించారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కేసుపై విచారణ ప్రారంభం కాగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ విజయ నారాయణన్‌, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌ఆర్‌ రాజగోపాల్‌ హాజరయ్యారు. న్యాయమూర్తులు ప్రభుత్వ తరఫు న్యాయవాదులతో మాట్లాడుతూ, ‘మనిషి ప్రాణాలంటే అధికారులకు అంత అలుసా?’ ఈ రాష్ట్రంలో మనిషి ప్రాణాలకు విలువలేదా? మ తి చెందిన ఆ యువతి కుటుంబీకులకు నష్టపరిహారం చెల్లించేస్తే సరిపోతుందా? ఆమె ప్రాణాలను తీసుకురాగలరా? మేకను బలిచ్చి, చెవులు కుట్టే తంతుకు ఫ్లెక్సీలు పెడితేనే బంధువు లు, స్నేహితులు వస్తారా? లేకుంటే రారా? నెత్తురోడుతున్న రహదారులను గురించి అధికారులు పట్టించుకోరా? ఇదంతా అధికారులకు తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమంగా ఫ్లెక్సీలు పెడితే కఠిన చర్యలు
ఇంకా ‘ప్రభుత్వమో, కార్పొరేషనో నష్టపరిహారం మాత్రం చెల్లించి చేతులు దులుపుకుంటాయే కానీ, సమాజంలో మార్పు తీసుకురావాలని భావించవు. ఈ విషయంలో పాలకులు సైతం తప్పిదాలకు పాల్పడుతున్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతి మనిషి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అక్రమంగా ఫ్లెక్సీలు పెట్టేవారిపైనా, అనుమతిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇదే న్యాయస్థానం ఐదు రకాల ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో ఏ ఉత్తర్వును కూడా పటిష్టంగా అమలు చేయనేలేదు. అధికారులు కంటితుడుపుగా సమావేశాలు జరిపి విచారణ కమిటీలు ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించి అంతటితో తమ బాధ్యత పూర్తయిపోయిందని భావిస్తారు. శుభశ్రీ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పగలరు? రాష్ట్రంలో అత్యధికంగా బ్యానర్లు పెడుతున్నదని రాజకీయ పార్టీలే. ఈ విషయంలో అధికారులు తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అనుకుంటే ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు బ్యానర్లపైన కూడా నిషేధం విధించవచ్చు. ఆ దిశగా చర్యలు తీసుకోమని చెప్పండి” అని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
బీచ్‌ రహదారిలో అన్నాడీఎంకే తరఫున ఏర్పాటు చేసిన బ్యానర్లు, పార్టీ పతాకాలను సంబంధిత అధికారులు తొలగించి తమకు నివేదికను సమర్పించమంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాదులకు న్యాయమూర్తులు ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా శుభశ్రీ కుటుంబీకులకు తాత్కాలిక నష్టపరిహారంగా రూ.5లక్షలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని, ఆ పరిహారం సొమ్మును ఈ కేసులో నిందితులైన అధికారుల నుంచి రాబట్టాలని ఆదేశించారు.
ఎఫ్‌ఐఆర్‌లోనూ తప్పిదాలా?
శుభశ్రీ మతి సంఘటనపై ఆమె తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో బ్యానర్‌ ప్రస్తావనే లేకపోవడం పట్ల న్యాయమూర్తులు పోలీసులపై మండిపడ్డారు. హెల్మెట్లు ధరించని వారిని సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి అపరాధం వసూలు చేస్తున్న పోలీసులు రహదారి అంతటా అందరూ చూస్తుండగానే అక్రమంగా బ్యానర్లు, పార్టీ పతాకాలు ఏర్పాటు చేస్తుంటే పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభశ్రీ మ తి ఘటనపైనా, అక్రమ బ్యానర్ల ఏర్పాటుపైనా కార్పొరేషన్‌ కమిషనర్‌, పోలీసు కమిషనర్‌ నిఘా వేసి విచారణ ఎలా సాగుతుందో పర్యవేక్షించాలని, అదే సమయంలో న్యాయస్థానం కూడా కేసు విచారణ సాగుతున్న తీరుపై నిఘా వేస్తుందన్నారు. ఆ తర్వాత కేసు తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి న్యాయమూర్తులు వాయిదా వేశారు.
ఆ ప్రకటనలన్నీ ప్రమాణ పత్రాలే…
డీఎంకే తరఫున బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయవద్దంటూ పార్టీ కార్యకర్తలు, ప్రముఖులనుద్దేశించి జారీ చేసిన ప్రకటనను ప్రమాణ పత్రంగా నమోదు చేసుకుంటున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇదే రీతిలో అన్నాడీఎంకే తరఫున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం జారీ చేసిన ప్రకటనలతోపాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు బ్యానర్లకు వ్యతిరేకంగా చేసే ప్రకటనలను కూడా ప్రమాణ పత్రాలుగా నమోదు చేస్తామన్నారు.
మాజీ కౌన్సిలర్‌పై కేసు…
శుభశ్రీ మతికి కారణమైన బ్యానర్‌ను ఏర్పాటు చేసిన అన్నాడీఎంకేకు చెందిన మాజీ కౌన్సిలర్‌ జయగోపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమారుడి వివాహ వేడుకల సందర్భంగా క్రోంపేట రహదారి పొడవునా ముఖ్యమంత్రి ఎడప్పాడి, ఉప ముఖ్యమంత్రి ఎడప్పాడికి స్వాగతం పలుకుతూ వందల సంఖ్యలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లలో ఒకటి స్కూటీ నడుపుతున్న శుభశ్రీపై జారడంతో ఆమె అదుపు తప్పి రోడ్డుపై పడటమూ, అదే సమయంలో వేగంగా వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ దూసుకుపోవడంతో మ తి చెందారు. శుభశ్రీ మ తిపై హైకోర్టు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కేసును తీవ్రంగా విచారణ జరుపుతుండటంతో పరంగిమలై పోలీసులు జయగోపాల్‌పై కేసు నమోదు చేశారు.
ఫ్లెక్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌కు సీలు…
శుభశ్రీ మతికి కారణమైన ఫ్లెక్సీ ముద్రించిన క్రోంపేటలోని ప్రెస్‌కు అధికారులు సీలుపెట్టారు. శుభశ్రీ మీద పడిన బ్యానర్‌పై ప్రింటింగ్‌ ప్రెస్‌ పేరుగానీ, పోలీసులు జారీ చేసిన అనుమతి సంఖ్యగానీ ముద్రించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై ప్రెస్‌కు వెళ్ళి షట్టర్‌ మూసి సీలు వేశారు.
ఫ్లెక్సీల సంస్కతికి స్వస్తిపలకండి…
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఇకనైనా బ్యానర్ల సంస్క తికి స్వస్తి పలకాలని శుభశ్రీ తండ్రి రవి విజ్ఞప్తి చేశారు. రహదారిపై ఫ్లెక్సీ వల్లే తన కుమార్తె ప్రాణాలు పోయిందని, ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయామని, ఇటువంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నామని ఆవేదనగా చెప్పారు. శుభశ్రీ వచ్చే నెల ఉద్యోగం నిమిత్తం కెనడా వెళ్లాల్సి ఉందని, అయితే ఈలోగా మ త్యువు బ్యానర్‌ రూపంలో ఆమెను కబళించిందని వాపోయారు. తన కుమార్తె మ తి సంఘటనతోనైనా రాష్ట్రంలో బ్యానర్ల సంస్క తి అంతరించిపోవాలని, లారీలను నడిపే డ్రైవర్లు కూడా వేగ నియంత్రణ పాటించాలని ఆయన హితవు చెప్పారు.
కొవ్వొత్తులతో నివాళి…
శుభశ్రీ మతి పట్ల సంతాప సూచకంగా ఆమె స్నేహితులు, బంధువులు నివాళులర్పించారు. క్రోం పేట భవానీనగర్‌లో శుభశ్రీ చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి, పుష్పాలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శుభశ్రీ స్నేహితులు మాట్లాడుతూ, మంచి స్నేహితురాలని కోల్పోయామని, ఎప్పుడూ చాలా చలాకీగా ఉండేదని, వచ్చే నెల ఉద్యోగం నిమిత్తం కెనడాకు వెళ్లనున్నట్లు శుభశ్రీ సంతోషంగా చెబుతుండేదని, ఆ ఆశ నెరవేరక ముందే ఓ బ్యానర్‌ ఆమె ప్రాణాలను హరించివేసిందని విలపించారు. ఇకనైనా పాలకులు స్పందించి రాష్ట్రంలో బ్యానర్లను నిషేధించాలని కోరారు. ఇదే రీతిలో తురైపాకంలో శుభశ్రీ పనిచేసిన ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ సంస్థలోనూ ఉద్యోగులు ఆమెకు నివాళులర్పించారు.