ఆళ్లగడ్డ ::విభారె న్యూస్ :: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా ఈ నెల 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు ఆళ్లగడ్డ పట్టణం టి.బి. రోడ్డు లోని ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, ఆవుల లతారెడ్డి తెలిపారు. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ వినాయక చవితి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు మనం వినాయక చవితి గా జరుపుకుంటామని ఆయన తెలిపారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే అనేక రసాయనాలు కలిపి తయారుచేసిన విగ్రహాల వలన పర్యావరణం దెబ్బతింటుందని, రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పిల్లలకు విద్యార్థి దశ నుండే పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రసాయనాలు వాడిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన వాతావరణ కాలుష్యం మరియు జల కాలుష్యం ఏర్పడుతోందని దీని వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆయన తెలిపారు. పూర్వం అందరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించే వారు. కనుక సర్వసిద్ధంగా ప్రకృతి మనకు ఇచ్చిన మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించుకునేవారు. ప్రజల్లో కూడా పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెరిగిందని, ప్రతి ఏటా మట్టి వినాయక విగ్రహాలకు పెరుగుతున్న ఆదరణ అందుకు నిదర్శనం అని ఆయన తెలిపారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజించి ఆ విగ్నేశ్వరుని కృపకు పాత్రులు కావాలని అయన ఆకాంక్షించారు.