నంద్యాల ప్రముఖులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి బండ్లపల్లి


ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్):: 2023 మార్చి నెలలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఎమ్మెల్సీ అభ్యర్థి బండ్లపల్లి మదన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రచారంలో భాగంగా ఈరోజు ఆయన నంద్యాలలోని శాంతారామ్ విద్యాసంస్థల అధినేతను, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్.ఎం. డి. ఫరూక్ ను కలిసి మద్దతు కోరినట్లు తెలిసింది. వారి నుండి స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది. కడప కర్నూలు అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులను కలిసి వారి మద్దతు కోరనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో కేంద్ర విద్యా శాఖ మాజీ మంత్రి పల్లంరాజు దగ్గర పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. ఆ సమయంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులను కేంద్రమంత్రికి పరిచయం చేసి అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ, తిరుపతిలో ఐఐటి, సంస్కృత విద్యా సంస్థ ఏర్పాటుకు అప్పటి మంత్రి పల్లంరాజును ఒప్పించి మంజూరు చేయించారు. అప్పటి రక్షణ శాఖ మంత్రి దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తూ, కలికిరిలో సైనిక పాఠశాల ఏర్పాటుకు మంత్రిని ఒప్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కలిగించేందుకు ముఖ్య పాత్ర పోషించారు. సొంత నిధులతో సైన్స్ ఆన్ వీల్స్ అనే బస్సును ఏర్పాటు చేసి విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు.20 సంవత్సరాల క్రితం రూరల్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ( రాడ్స్) అనే సంస్థను స్థాపించి రాయలసీమ ప్రాంత రైతులకు వివిధ రంగాలలో అవగాహన కల్పిస్తూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. బండ్లపల్లి మదన్ మోహన్ రెడ్డి రైతుల కొరకు చేస్తున్న కృషిని, సేవలను గుర్తించిన అమెరికాలోని లూసియానా రాష్ట్రం మేయర్ ఘనంగా సన్మానించి అవార్డు ప్రదానం చేశారు.ప్రస్తుతం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలోని లోకల్ అడ్వైజరీ కమిటీలో సభ్యునిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ ఫౌండేషన్, న్యూఢిల్లీ,మరియు కన్సార్టియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ కు సెక్రెటరీగా సేవలందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకున్నారు. విద్యాభివృద్ధి మరియు ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అతి త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను రూపొందించి ఉపాధ్యాయుల మద్దతు కొరతానని ఎమ్మెల్సీ అభ్యర్థి బండ్లపల్లి మదన్మోహన్ రెడ్డి తెలిపారు.