విభారె న్యూస్ :: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం అవినీతిపై యుద్ధం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఏ సి బి అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలోని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఈ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఆమదాలవలస రోడ్లు, భవనాల శాఖ డీఈ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పలు విభాగాలలో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరులోని రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. మరోవైపు విశాఖ పట్నం జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ అదనపు ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ రామచంద్రవరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.