పాకిస్తాన్ నుంచి వచ్చిన కుటుంబంలో 11 మంది సామూహిక ఆత్మహత్య
జోధ్పూర్ :: రాజస్థాన్లో జోధ్పూర్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలోని 11మంది సభ్యులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలోని 12మంది విషం తాగి ఆత్మహత్య కు పాల్పడ్డారు. వీరిలో 11మంది మరణించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జోధ్పూర్ పోలీసులు తెలిపారు.
రాజస్థాన్లోని దేచు పోలీస్స్టేషన్ పరిధిలోని
తోహదాత గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. గత కొద్దికాలం క్రితం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ ఒక హిందూ కుటుంబం జోధ్పుర్ లో నివాసముంటోంది. తోహ్దాత గ్రామంలో కొంతవ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని దానికి సమీపంలోనే నివాసం ఉంటున్నారు. ఈ కుటుంబంలోని సభ్యులందరూ నిన్న రాత్రి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఇంటి సమీపంలో ఈ కుటుంబంలోని వారందరూ చనిపోయే పడివుండటాన్ని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే వారిలో 11మంది మరణించినట్లుగ్రహించారు. ఇంటి బయట ఒకరు మాత్రం ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతన్ని ఆసుపత్రికి తరలించారు. క్లూస్టీంతోపాటు ప్రత్యేక దర్యాప్తు బృందం అక్కడకు చేరుకుంది. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు