అమెరికాలో మొట్టమొదటి సారి కరోనా సోకిన శునకం మృతి.
న్యూయార్క్: కరోనా మహమ్మారి మనుషులకే కాదు కొన్ని సందర్భాల్లో జంతువులకు కూడా సోకుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో కొన్ని జంతువుల్లో వైరస్ బయటపడ్డట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అమెరికాలో మొట్ట మొదటిసారిగా కరోనా సోకిన పెంపుడు కుక్క ఈ మధ్యనే చనిపోయింది .
న్యూయార్క్కు చెందిన ఒక వ్యక్తి జర్మన్ షపర్డ్ సంతతికి చెందిన శునకాన్ని పెంచుతున్నాడు. ముందుగా అతనికి వైరస్ నిర్ధారణ అయ్యింది. తరువాత కొన్నిరోజులకు శునకానికీ శ్వాసకు సంబందించిన సమస్యలు మొదలయ్యాయి . దీంతో మే నెలలో పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్ సోకినట్లు పశువైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని అక్కడి వ్యవసాయ శాఖ జూన్ నెలలో ప్రకటించింది . కొన్ని వారాల తర్వాత శునకం అనారోగ్యం మరింత ఎక్కువైంది . దీంతో జులై 11న ఆ శునకం కరోనాతో మృతిచెందింది. శునకం మరణించే ముందు దానికి కాన్సర్ సంబంధ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే, వైరస్ వలన కాన్సర్ వృద్ధి చెంది శునకం మరణించిందా? లేక వైరస్ వల్లనే మరణించిందా? అనే విషయంపై స్పష్టత కోసం న్యూయార్క్ ఆరోగ్యశాఖ అధికారులు ఆ శునకం యజమాని ఇంటికి వెళ్లేసరికి, అప్పటికే అంత్యక్రియలు పూర్తి అయిపోయాయి .