అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇవాళ గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 7,998 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మన రాష్ట్రంలో ఒకే రోజు ఇంత సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 1391 కేసులు, గుంటూరు జిల్లాలో 1184, అనంతపురంలో 1,016 కేసులు వచ్చాయి. కరోనా ఈ ఒక్కరోజే 61 మంది ప్రాణాలు బలిగొంది. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 884కి చేరింది. తూర్పుగోదావరిలో 14 మంది, గుంటూరులో 7, కర్నూలులో 7, కృష్ణా, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నం, విజయనగరంలో 5, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 3, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు నమోదైన కేసుల సంఖ్య 72,711గా ఉంది. ఇప్పటి వరకు 37,555 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.మరో 34,272 మంది వివిధ ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.