బ్రిటన్ : ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి కి చెక్ పెట్టే దిశగా అనేక దేశాలు ప్రయోగాలు వేగవంతం చేశాయి.యావత్ ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలు వ్యాక్సిన్లపై ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ ఎడిటర్ పెట్టిన ఓ ట్వీట్ తాజాగా సంచలనంగా మారింది. ఎందుకంటే వ్యాక్సిన్ రేసులో ముందున్న ఆక్స్ఫర్డ్ టీకా అధ్యయన ఫలితాలను ప్రకటించనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంతోపాటు సామాన్యుల్లోనూ ఆ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
‘రేపు.. వ్యాక్సిన్..జస్ట్ సేయింగ్’ అంటూ లాన్సెట్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హార్టన్ నిన్న ట్వీట్ చేశారు. దీంతో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఫేజ్-I క్లినికల్ ట్రయల్స్ డేటాను నేడు ఆ జర్నల్ ప్రచురించనున్నట్లు తెలుస్తోంది. మానవ పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ టీకా కరోనా వైరస్కు వ్యతిరేకంగా రెండు అంచెలుగా రక్షణ ఇవ్వగలదని ఆక్స్ఫర్డ్ పరిశోధకుల బృందం తేల్చి చెప్పినట్లు యూకే మీడియా గత గురువారం ప్రకటించింది.
ఇప్పుడు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకొంటున్న ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగస్వామ్యం కలిగిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వచ్చే నెలలో భారత్లో మానవ ప్రయోగాలు ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ఈ సంవత్సరం చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ సీఈఓ అడార్ పూనావాలా పేర్కొన్నారు.
ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉండగా, ఇందులో 12కు పైగా టీకాలు మనుషులపై క్లినికల్ ట్రయల్స్లో అనేక దశల్లో ఉన్నాయి