మహానందిలో జూలై 5న శాకంబరీ దేవి ఉత్సవం : వేదపండితులు రవిశంకర్అవేద పండితులు రవిశంకర్ అవధాని

మహానంది:(విభారె న్యూస్)      

శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం జూలై 5వ తేదీ ఆషాడ శుద్ధ  గురుపౌర్ణమి రోజున శాకంబరీ దేవి ఉత్సవం నిర్వహించబడుతుందని మహానంది దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు.  శాకంబరి  విశిష్టతను తెలియజేశారు.

అనాదిగా ఈ సాంప్రదాయం పాటిస్తున్నారు. ఆషాఢ మాసంలో ఒకరోజు శాకంబరీ  ఉత్సవం నిర్వహిస్తారు. అమ్మవారి శాకంబరి అవతారం మనిషి ఆకలిని తీర్చడానికి ఉద్భవించింది.శాకంబరీగా పూజించటం వల్ల  క్షామం నుండి విముక్తి లభిస్తుంది మరియు ఆకలి దరి చేరదు అని ఋషి వాక్యం.  అమ్మవారికి శాకంబరి ఉత్సవం సందర్భంగా, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు  పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తారు. భక్తులు కూడా దక్షిణగా పండ్లు, కూరగాయలు సమర్పించడం చాలా ముఖ్యం శుభం కుడా. 

 “పురాణ గాధ”ను పరిశీలిస్తే …

వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహంతో వేదాలన్నీ తనలో దాచుకున్నాడు.  దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపొయి చెడు మార్గంలో పయనించడం ఆరంభించారు. తత్ఫలితంగా యజ్ల హవిస్సు అందక దేవతలంతాశక్తి హీనులైపోయారు. నదులు ఎండి పోయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. సకల లోకములూ ఆకలితో అలమటించ సాగాయి. దీన్ని గమనించిన కొందరు ఋషులు, దేవతలు సర్వ శక్తి స్వరూపిణి అయిన పార్వతిఅమ్మవారిని ప్రార్ధించగా అప్పుడు పార్వతి అమ్మవారి కరుణతో “శతాక్షి” అనే పేరుతో అనేకమైన కన్నులతో భూమి మీదకు ఓ శక్తి వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకంలో వున్న దుస్థితిని  చూసి అమ్మవారి ఒక  కన్ను నుంచి నీరు వచ్చి అది ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించసాగింది పాడి పంటలు వృద్ధి చెందాలని. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచం వ్యవధి  పడుతుంది కనుక,అప్పటి వరకు ప్రజల ఆకలి తీర్చటానికని అమ్మవారు  దయతో  శాకంబరి అవతారంలో ప్రత్యక్షమై వివిధమైన కాయగూరలు పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టు లాగా ఆవిర్భవించింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా  తరగని సంపదతో  అలాగే కూరగాయలు, పళ్ళు ఇస్తూ మహావృక్షంగా నిలిచిన అమ్మవారి అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే  ఈ శాకంబరి అవతారం.

అనంతరం పార్వతి అమ్మవారు తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో ఉద్భవించి దుర్గమాసురుడు అతని రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది. తదనంతరం గురు పూర్ణిమ నుండి తిరిగి దేవతలు, ఋషులు, పండితులు వేద పఠనం, యజ్లం,దేవతానుష్ఠానములను కొనసాగించడంతో దేవతలు ఋషులే కాక సకల ప్రాణికోటి సుఖంగా ఉండడం జరిగింది.అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శాకంబరిగా అమ్మవారిని కొలవడం ఆనవాయితీగా మారిందని వేదపండితులు రవిశంకర్ అవధాని తెలియజేశారు.