లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరు లక్షల రూపాయల భారీ జరిమానా

జైపూర్‌: ఒకవైపు ప్రభుత్వాలు అధికారులు కట్టడి చేసే మార్గాలు తెలియక సతమతం అవుతూ ఉంటే ఇంకోవైపు ప్రజలు ఇష్టారాజ్యంగా విందులు వినోదాలు చేసుకుంటూ కరోనా వైరస్ ను వ్యాప్తి చేసినందుకు ఒక కుటుంబానికి ఏకంగా ఆరు లక్షల రూపాయలు జరిమానా విధించిన సంఘటన జైపూర్ లో జరిగింది.

దేశంలో ఓ వైపు కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతుండగా.. మరోవైపు కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ వివాహలు, పలు శుభకార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వాలు ఎంత చెప్పిన పెడచెవిన పెడుతున్నారు. నిర్లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఓ కలెక్టర్‌ వినూత్ననంగా ఆలోచించాడు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా సోకడానికి కారణమైన ఓ కుటుంబానికి రూ.6 లక్షలకుపైగా జరిమానా విధించారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాకు చెందిన గీసులాల్‌ రాఠీ ఈ నెల 13న తన కుమారుడి వివాహం ఘనంగా జరిపించాడు. 

  లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో వివాహ కార్యక్రమాలకు కేవలం 50 మంది అతిథులకే అధికారుల అనుమతి ఉంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కి   వివాహ వేడుకకు భారీ సంఖ్యలో అతిథులు హాజరయ్యారు.  ఈ వేడుకకు హాజరైన అతిథులలో 15 మందికి కరోనా సోకింది. వీరిలో ఒకరు చనిపోయారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన గీసులాల్‌ రాఠీపై పోలీసులు ఈ నెల 22న కేసు నమోదు చేశారు.  కరోనా సోకిన 15 మందిని ప్రభుత్వం ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందించింది.  కరోనా సోకిన వారి పరీక్షలకు, చికిత్సకు, ఆహారానికి, అంబులెన్స్‌కు  రూ.6,26,600 ఖర్చు అయింది. నిబంధనలు ఉల్లంఘించి,  నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇంతమందికి కరోనా సోకడానికి కారణమైన గీసులాల్‌ నుంచే డబ్బులు రాబట్టాలని జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర భట్‌ అధికారులకు ఆదేశించారు. జరిమానా ద్వారా వసూలైన డబ్బును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు డిపాజిట్‌ చేయాలని కలెక్టర్ సూచించారు.