డోలాయమానంలో సింగరేణి కార్మిక సంఘాలు

ఆర్టీసీ తరహాలో యూనియన్‌ సంఘాలకు చెక్‌ పెట్టే యోచనలో టి.సర్కార్‌

  • -త్వరలోనే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు
  • -ఎటూ తేల్చుకోలేకపోతున్న కార్మిక సంఘాలు
  • -తలలు పట్టుకుంటున్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు
  • -కార్మిక సంఘాల పేరు వింటేనే మండిపడుతున్న సీఎం
  • -కేసీఆర్‌ తీరుపై కార్మిక సంఘాల గుర్రు
  • -టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా కవిత రాజీనామా
  • -టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా హరీష్‌రావు రాజీనామా
  • – వ్యూహంలో భాగంగానే ముందస్తు రాజీనామాలా?

హైదరాబాద్‌:
ఆర్టీసీ సమ్మె సింగరేణికి తలనొప్పిగా మారిందా? ఆర్టీసీ కార్మిక సంఘాల వల్లే సంస్థకు, కార్మికులకు అన్యాయం జరిగిందని కేసీఆర్‌ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఇదే వాదనను సింగరేణి కార్మిక సంఘాలకు వర్తింప చేస్తే తమ పరిస్థితి ఏంటని సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. త్వరలోనే సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎటువైపు నిలబడాలో తేల్చుకోలేక నలిగిపోతున్నారట సింగరేణి ఏరియాతో టచ్‌ వున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు.
ఆర్టీసీ కార్మికల సమ్మె మొదలైన నాటి నుంచి కార్మిక సంఘాలపై కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారు. సంఘాలే కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని పలుమార్లు ప్రకటించిన సిఎం చివరకు ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెక్‌ పెట్టారు. దాంతో మిగతా కార్మిక సంఘాల్లో టెన్షన్‌ మొదలైంది. అయితే కార్మిక సంఘాలు లేకుండా చేయడం సాధ్యం కాదని, సిఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కార్మిక నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు. వీరికి మద్దతుగా మాజీ హోం మంత్రి , టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి కూడా సంఘాలకు మద్దతుగా ప్రకటనలు చేయడంతో ఇప్పుడు సింగరేణి పరిధిలో ఉన్న గులాబీ ప్రజాప్రతినిధులకు గుబులు పట్టుకుంది.
కొద్ది రోజుల్లో సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలున్నాయి.. దీంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు టెన్షన్‌ పట్టుకుంది. ఒకవైపు కార్మిక సంఘాల పేరు వింటేనే సిఎం ఒంటికాలిపై లేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ నిర్ణయంపై కార్మికసంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో తాము ఎవరివైపు నిలబడాలో తెలీక సతమతమవుతున్నారు.

ఇప్పుడు కార్మికులను కాదని సిఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటనే బెంగపట్టుకుందట ఆ ఎమ్మెల్యేలకి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌లోని రామగుండం, ఆదిలాబాద్‌లోని బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, వరంగల్‌లో భూపాలపల్లి, ఖమ్మంలోని కొత్తగూడెం , పాల్వంచ, ఇల్లందులతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు.. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పుడు ఈ అంశం తలనొప్పిగా మారింది.
రెండేళ్ల పాటు ఆర్టీసీ గుర్తింపు సంఘాల మనుగడకు బ్రేకులు వేసిన సిఎం, ఇప్పుడు మిగతా సంఘాల విషయం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం తమకు తిప్పలు తప్పవని పెద్దల దగ్గర మొరపెట్టుకుంటున్నారట కొందరు ఎమ్మెల్యేలు. ఆర్టీసీ సంఘాల విషయంలో కఠినంగా వ్యవహరించిన గులాబీ బాస్‌, ఇప్పుడు సింగరేణి విషయంలో ఏం చేస్తారో తెలియక సదరు నాయకులు బిక్కుబిక్కుమంటున్నారు.
‘సింగరేణిలోనూ కార్మిక సంఘాలు ఉనికి కోల్పోనున్నాయా? ఆర్టీసీలో ట్రేడ్‌ యూనియన్లు ఉండొద్దన్న సీఎం కేసీఆర్‌ మాట వెనుక ఆంతర్యం ఏంటి? కార్మిక సంఘాలను ఖాళీ చేయించేందుకు టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాల గౌరవ అధ్యక్షులుగా ఉన్న కవిత, హరీశ్‌తో కేసీఆరే వ్యూహాత్మకంగా రాజీనామాలు చేయించారా?”..ఇదీ కోల్‌బెల్ట్‌ పరిధిలోని కార్మిక వర్గాల్లో సాగుతున్న చర్చ. ఆర్టీసీ విషయంలో కేసీఆర్‌ వ్యవహరించిన తీరు.. అక్కడికే పరిమితమవుతుందా? మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకూ వర్తింపజేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణిలో టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌.. గుర్తింపు సంఘంగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర లేబర్‌ కమిషనర్‌ అందజేసిన సర్టిఫికెట్‌ ప్రకారం గుర్తింపు సంఘం కాలపరిమితి శనివారంతో ముగిసింది. కానీ, సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కార్మిక శాఖ కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇప్పుడదే కార్మికుల్లో గుబులు రేపుతోంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా అనేక కార్మిక సంఘాలు పుట్టుకొచ్చాయి. వీటిలో కీలకమైనవి ఆర్టీసీలో టీఎంయూ, సింగరేణిలో టీబీజీకేఎస్‌. టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించిన హరీశ్‌.. జనవరి 31న ఆ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు సింగరేణిలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కేసీఆర్‌ కుమార్తె కవిత సైతం లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 2న పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్లు అవసరం లేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. వ్యూహత్మకంగానే వారిద్దరితో ముందుగా రాజీనామా చేయించారా? అన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తయినందున ఈ నెల చివరిలో నోటిఫికేషన్‌ జారీ చేయాలని సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ను కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అనుబంధ బీఎంఎస్‌ ప్రతినిధి వర్గం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కార్మిక మంత్రి గంగ్వార్‌తో పాటు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ను కలిసి సింగరేణిలో ఎన్నికలు జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో బొగ్గుశాఖ మంత్రి సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు ఫోన్‌ చేసి కేంద్ర కార్మిక మంత్రి ఆదేశాలను సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ అమలు చేస్తారని, అభ్యంతరాలు పెట్టవద్దని పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయా? జరిగితే ఎప్పుడు? లేదంటే గుర్తింపు సంఘం కాలపరిమితి పెంచుతారా? అనేది సింగరేణిలో చర్చనీయాంశమైంది.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికే టీబీజీకేఎస్‌ గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసింది. గత ఎన్నికల్లో కార్మికులను ప్రలోభ పెట్టి టీబీజీకేఎస్‌ గెలిచిందంటూ సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌కు కార్మిక సంఘాల ఫిర్యాదు చేశారు. దీంతో కాలపరిమితి 4 ఏళ్ల నుంచి రెండేళ్లకు లేబర్‌ కమిషనర్‌ కుదించారు. బీఎంఎస్‌ వినతితో ఎన్నికల నిర్వహణకు లేబర్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోంటోంది. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో కార్మిక సంఘాలు ఉండొద్దని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ వ్యాఖ్యలతో టీబీజీకేఎస్‌ నేతల్లో చర్చ జరుగుతోంది. టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా మాజీ ఎంపీ కవితను ముందుచూపుతోనే రాజీనామా చేయించారని కార్మికుల్లో విస్త తమైన చర్చ జరుగుతోంది. గతంలో కేసీఆర్‌ సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు టీబీజీకేఎస్‌ను పోటీకి దించుతారా లేదా అని కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.