నాన్న లేకుంటే నేను లేను : ధ్రువ్‌ విక్రమ్‌

సినిమా: నాన్న లేకుంటే తాను లేను అని పేర్కొన్నారు నవ నటుడు ధ్రువ్‌ విక్రమ్‌. నటుడు విక్రమ్‌ వారసుడైన ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి ఇది రీమేక్‌. ఇందులో ధ్రువ్‌ విక్రమ్‌కు జంటగా బనిత, ప్రియా ఆనంద్‌, అన్భుదాసన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. గిరిసాయి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రధన్‌ సంగీతాన్ని అందించారు. కాగా ఆదిత్యవర్మ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్‌లో జరిగింది. చిత్ర నిర్మాత ముఖేశ్‌
మెహతా మాట్లాడుతూ ఆదిత్యవర్మ చిత్ర షూటింగ్‌లో నటుడు విక్రమ్‌ ఎప్పుడు ఒక స్టార్‌ నటుడిగా నడుచుకోలేదన్నారు. 2021లో విక్రమ్‌, ధ్రువ్‌విక్రమ్‌ కలిసి నటించి మనల్ని ఆనందపరుస్తారని భావిస్తున్నానన్నారు. ధ్రువ్‌ విక్రమ్‌ మాట్లాడుతూ తాను పలు పాఠాశాలల్లో, కళాశాల్లో ప్రసంగించానన్నారు. అయితే ఈ వేడుక కొంచెం ప్రత్యేకం అన్నారు. కారణం తన కుటుంబం ఇక్కడ ఉందన్నారు. చిత్ర దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడి గురించి ధ్రువ్‌ విక్రమ్‌ మాట్లాడుతూ ప్రారంభం నుంచి ఈ చిత్రానికి ప్రతిభావంతులు ఉండడం చూసి ఘనతగా భావించానన్నారు. తన తండ్రి విక్రమ్‌ గురించి చెప్పడానికి మాటలు లేవన్నారు. ఈ చిత్రానికి అంకితభావం 100 శాతం అని చెప్పారు. తన తండ్రి మంచి నటుడన్నదానికంటే మంచి తండ్రి అన్నదే తనకు తెలుసన్నారు. నటుడు విక్రమ్‌ మాట్లాడుతూ ధ్రువ్‌ మాదిరి మాట్లాడడం తనకు రాదన్నారు. తనకు 12వ తరగతి పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నప్పుడో, తాను నటించిన సేతు చిత్రం విడుదల కోసం ఎదురు చూసినప్పుడో ఎలాంటి ఆందోళనకు గురి కాలేదన్నది ఒప్పుకుంటున్నానన్నారు. ఇప్పుడే కాదు, కొద్ది రోజులుగా తాను చాలా ఆందోళన చెందుతున్నానన్నారు. ఈ చిత్రంలో ధ్రువ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నందుకు, అతనిపై నమ్మకం పెట్టినందుకు నిర్మాత ముఖేష్‌ మెహతాకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడు షరియా లేకుంటే ఈ చిత్రం సాధ్యం అయ్యేది కాదని పేర్కొన్నారు.