కార్పొరేట్‌ పన్నులపై ఊరట

ఆదాయ పన్ను చట్టంలో సవరణలు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌
  • ఆర్థిక మందగమనానికి విరుగుడు మందు
  • నూతన తయారీ రంగ సంస్థలకు వెసలుబాటు
  • జీడీపీ వృద్ధిరేటు పెంచేందుకే నిర్ణయం
  • మేక్‌ ఇన్‌ ఇండియాకు ఊతమిచ్చే ప్రక్రియ
  • ప్రత్యామ్నాయ పన్నులకు కూడా మినహాయింపు
  • అయితే ప్రోత్సాహకాలు, రాయితీలు ఉండవు
  • జైట్లీ హామీని నెరవేర్చిన నిర్మలా సీతారామన్‌
  • ఆర్థిక మంత్రి ప్రకటనతో దేశీయ మార్కెట్ల లాభాల మోత
  • 1900 పాయింట్ల పైన ఎగబాకిన సెన్సెక్స్‌
  • హర్షం వ్యక్తం చేసిన ఆర్బీఐ గవర్నర్‌

పనాజీ: ఆర్ధిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ కంపెనీలు, నూతన తయారీ రంగ సంస్థలకు కార్పొరేట్‌ పన్నులు తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో సవరణలు చేయనున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం జీఎస్టీ మండలి సమావేశమవుతుండగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గోవాలోని పనాజీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆర్ధిక మంత్రి నిర్మల మాట్లాడుతూ…
”మేకిన్‌ ఇండియాకు ఊతమిచ్చేలా 2019-20 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను చట్టానికి మరో సవరణ జరగనుంది. దీంతో దేశీయ కంపెనీలు 22 శాతం పన్ను చెల్లించేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త తయారీ రంగ సంస్థలు కూడా 15 శాతం పన్ను చెల్లించేలా అవకాశం దొరకుతుంది. అయితే కొత్త పన్ను చట్టం కింద కంపెనీలకు మినహాయింపులు, ప్రోత్సహకాలు ఉండవు…” అని పేర్కొన్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో సర్‌చార్జిలు, సెస్‌తో కలిపి దేశీయ కంపెనీల పన్ను రేటు 25.7 శాతంగా ఉండనుంది. ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మందగమనాన్ని అధిగమించేందుకు పన్ను రేట్లు తగ్గించాలంటూ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
మందగమనంలో ఉన్న దేశ ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించే దిశగా మరిన్ని ఉద్దీపనలతో ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దేశీయ కంపెనీల కార్పొరేట్‌ పన్నును(సర్‌ఛార్జ్‌, సెస్‌ కలిపి) 34.94శాతం నుంచి 25.17శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనను చేర్చుతూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా తయారీ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు, వద్ధిరేటు పెంచేందుకే కార్పొరేట్‌ పన్నులను తగ్గించినట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రి ప్రకటనలో కీలక అంశాలివే..
ప్రస్తుతం కార్పొరేట్‌ పన్ను 30 శాతంగా ఉంది. సర్‌ఛార్జ్‌, సెస్‌ అన్నీ కలిపి ఇది రూ.34.94శాతం. కొత్త నిబంధనలతో దేశీయ కంపెనీల కార్పొరేట్‌ పన్ను 22శాతానికి తగ్గింది. అంటే సర్‌ఛార్జ్‌లు, సెస్‌ కలిసి 25.17శాతం అవుతుంది. అయితే ఇందుకు ఓ షరతు కూడా ఉంది. 22 శాతం రేటుతో కార్పొరేట్‌ పన్ను కడితే ఆ కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అందవు.
అక్టోబరు 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త దేశీయ తయారీ రంగ సంస్థలు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు తీసుకోకుండా 15శాతం ఆదాయపు పన్ను చెల్లించొచ్చు. దీంతో కొత్త సంస్థలకు కార్పొరేట్‌ పన్ను(సర్‌ఛార్జ్‌, సెస్‌ కలిపి) 17.01శాతానికి తగ్గింది. ఈ కంపెనీలకు ఇప్పటివరకు కార్పొరేట్‌ పన్ను 25శాతంగా ఉండగా.. సర్‌ఛార్జ్‌, సెస్‌ కలిపి 29.12శాతంగా ఉండేది.
ఈ ఆదాయపుపన్ను శ్లాబులో ఉన్న కంపెనీలు కనీస ప్రత్యామ్నాయ పన్నులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రోత్సాహకాలు, రాయితీలు అందుకోవాలంటే కంపెనీలు పాత పన్ను విధానంలోనే కార్పొరేటు పన్నులు చెల్లించుకోవచ్చు. అయితే పాత పన్నుల విధానంలో చెల్లించే కంపెనీలకు కనీస పత్యామ్నాయ పన్నులో కొంత ఊరట లభించింది. కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5శాతం నుంచి 15శాతానికి తగ్గించారు.
కంపెనీల ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా వచ్చిన మూలధనంపై ఇకపై ఎలాంటి సర్‌ఛార్జ్‌ ఉండదు.
జులై 5, 2019 కంటే ముందే షేర్ల బైబ్యాక్‌ ప్రకటించిన లిస్టెడ్‌ కంపెనీలకు ఎలాంటి సూపర్‌ రిచ్‌ పన్ను ఉండదు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఇతర ఉద్దీపనలతో ప్రభుత్వం ఏటా రూ.1.45లక్షల కోట్ల ఆదాయం కోల్పోనుంది.
జైట్లీ హామీ నెరవేరిన వేళ..
2015-16 బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కార్పొరేట్‌ పన్నులపై అప్పటి ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్‌ జైట్లీ కొన్ని హామీలిచ్చారు. రానున్న నాలుగేళ్లలో అంటే 2019 నాటికి కార్పొరేట్‌ పన్నును 25శాతానికి తీసుకొస్తామని నాడు జైట్లీ అన్నారు. అయితే అది దశలవారీగా జరుగుతుందన్నారు. అన్నట్లుగానే 2017లో రూ.50 కోట్ల కంటే తక్కువ టర్నోవర్‌ కలిగిన కంపెనీల కార్పొరేట్‌ పన్నును తగ్గించారు.
ఆరునెలల క్రితం కూడా జైట్లీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. జీఎస్‌టీ వసూళ్లు మెరుగైతే అన్ని కంపెనీల కార్పొరేట్‌ పన్నులను 25శాతానికి తీసుకొస్తామని స్పష్టం చేశారు. తాజాగా నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో జైట్లీ హామీ నెరవేరినట్లయింది.
దలాల్‌ స్ట్రీట్‌కు దీపావళి పండగ ముందే వచ్చేసినట్లుంది. కార్పొరేట్‌ రంగానికి పన్నుల విషయంలో ఊరట కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనలతో దేశీయ మార్కెట్లలో లాభాల మోత మోగింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ.5లక్షల కోట్ల పైనే పెరిగింది.
గురువారం నాటి ముగింపు ప్రకారం.. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ మార్కెట్‌ విలువ రూ.138.54లక్షల కోట్లుగా ఉంది. అయితే దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన వెంటనే మార్కెట్లు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత సెన్సెక్స్‌ ఏకంగా 1900 పాయింట్ల పైన ఎగబాకింది. ఫలితంగా బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ. 143.45లక్షల కోట్లకు పెరిగింది. అంటే కేవలం గంట వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ.5లక్షల కోట్ల పైన పెరిగింది.
అటు నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అవుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో నిఫ్టీ ఒక రోజులో ఇంత భారీగా లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1778 పాయింట్ల లాభంతో 37,872 వద్ద, నిఫ్టీ 524 పాయింట్ల లాభంతో 11,229 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.
ఆర్‌బీఐ గవర్నర్‌ హర్షం
ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశీయ ఉత్పత్తి కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయంపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ స్పందించారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఉద్దీపన చర్యల్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ఈ ప్రకటనను ఆయన స్వాగతించారు. ఇది కచ్చితంగా సాహసోపేతమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. శుక్రవారం ఆయన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ.. దేశీయ, కొత్త ఉత్పత్తి కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను తగ్గించడం ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థకు కచ్చితంగా మేలు చేసేదేనన్నారు. ఈ చర్యలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మందగమనం నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే దిశగా చేపట్టిన ఉద్దీపన చర్యల్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి దేశీయ కంపెనీల కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా 30 శాతం (సర్‌ఛార్జ్‌, సెస్‌ లేకుండా) ఉన్న పన్నును 25.17 శాతానికి తగ్గిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ ఆర్థిక ఏడాది నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయంటూ సీతారామన్‌ ప్రకటించారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా తయారీ రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు, జీడీపీ వద్ధిరేటు పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వివరించారు.