దసరా నుంచి పరుగులు తీయనున్న ప్రైవేటు రైళ్లు
న్యూఢిల్లీ: దేశంలోనే మొదటిసారి ప్రవేశపెట్టనున్న ప్రైవేటు రైళ్లు దసరా సందర్భంగా పరుగులు తీయనున్నాయి. దిల్లీ-లఖ్నవూ మధ్య తేజస్ ఎక్స్ప్రెస్ రైలు తొలి సర్వీసును అక్టోబరు 4న నడపనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. అయితే, అహ్మదాబాద్-ముంబయి మార్గంలో తేజస్ ఎక్స్ప్రెస్ను నడిపే అంశంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని వారు తెలిపారు. దిల్లీ-లఖ్నవూ తేజస్ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడవనుంది. తొలుత ఈ రైళ్లను ఐఆర్సీటీసీ నిర్వహించనుండగా, తర్వాత పరిస్థితులను బట్టి పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారని ఓ అధికారి తెలిపారు.
తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఆధునిక సౌకర్యాలను సమకూర్చారు. విమాన ప్రయాణం తరహాలో సదుపాయాలు ఉండనున్నాయి. విమానాశ్రయాల తరహాలో దిల్లీ-లఖ్నవూ మార్గంలోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు విలాసవంతమైన లాంజ్లు అందుబాటులోకి రానున్నాయి. ఉన్నత శ్రేణి ప్రయాణికులు నిర్దేశించిన ఛార్జీలు చెల్లించి వాటికి వినియోగించుకోవచ్చు. ప్రీమియం సౌకర్యాల్లో భాగంగా బిజినెస్ క్లాస్ ప్రయాణికులు లాంజ్ల్లో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు కల్పించనున్నారు. మరోవంక విమానాల్లో ఉండే ఎయిర్ హోస్టెస్ తరహాలో తేజస్ రైళ్లలోనూ ట్రెయిన్ హోస్టెస్లను నియమించనున్నారు. ఈ రైళ్లకు లోకో పైలట్, గార్డు, ఆర్పీఎఫ్ సిబ్బందిని రైల్వేశాఖ సమకూర్చనుండగా.. టిక్కెట్లు, హౌస్ కీపింగ్, కేటరింగ్ వంటివాటిని ఐఆర్సీటీసీ పర్యవేక్షించనుంది. తర్వాత ఈ సర్వీసులను పూర్తిగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించేలా ఐఆర్సీటీసీ టెండర్లు పిలిచే అవకాశముందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.