నిమజ్జనానికి

చెరువులు సిద్ధం 
26 చెరువులు అందుబాటులోకి తెచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు
  • 11 రోజులపాటు నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు 
  • భారీ వర్షాలతో నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్‌ 
  • ఏ క్షణమైనా గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమంటున్న యంత్రాంగం 
  • హుస్సేన్‌సాగర్‌ పరిసరాలలో ఆంక్షలు 
  • వ్యర్థాలను తొలగించేందుకు 9710 మంది పారిశుద్ధ్య కార్మికులు 
  • సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక బందోబస్తు 
  • శివారుల్లో నిమజ్జనం కోసం అందుబాటులో 255 క్రేన్లు 
  • 22.89 కోట్ల రూపాయల ఖర్చుతో 26 నిమజ్జన కొలనులు 

హైదరాబాద్‌: 
వినాయక చవితి సందర్భంగా.. 11 రోజులకు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఏటా పెద్ద ఎత్తున గణేష్‌ విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. ఈసారి ఎన్నడూ లేని విధంగా హుస్సేన్‌ సాగర్‌లో వాటర్‌ ఫ్లో ఎక్కువ కావడంతో.. నిమజ్జనానికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హుస్సేన్‌ సాగర్‌కు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌కి వచ్చిన వాళ్లు కనీసం ఒక్కసారన్నా.. నెక్లెస్‌ రోడ్డులోని హుస్సేన్‌ సాగర్‌ను చూడాలనుకుంటారు. హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడు మరో ప్రత్యేక ఆకర్షణ. హుస్సేన్‌ సాగర్‌లో బోటింగ్‌ చేసి బుద్ధుడి విగ్రహం దగ్గరకి వెళ్లి సెల్ఫీ తీసుకుని టూరిస్టులు ఎంజాయ్‌ చేస్తారు. 
హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌ సాగర్‌ నిండుకుండలా మారింది. నీటితో కళకళలాడుతోంది. కొన్ని రోజుల నుంచి నగర పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చి చేరుతున్న వరదతో హుస్సేన్‌ సాగర్‌ జలాశయాన్ని తలపిస్తోంది. సోమవారం నాటికి 2,2019.. సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయికి దగ్గర కావడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. నీటిని తరలించాలని నిర్ణయించారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తి వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పరీవాహక ప్రజలకు ఈ విషయం తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. హుస్సేన్‌ సాగర్‌కు వరదనీరు పోటెత్తుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ నీటి పరిమాణాన్ని గమనిస్తున్నారు. 
గణేష్‌ విగ్రహాల నిమజ్జనం సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్‌ 11 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి వరకు ఇవి అమల్లో ఉంటాయి. 
-కర్బాలా మైదాన్‌ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదికి అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా వైపు పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్ళాల్సిన వారు కవాడిగూడ చౌరస్తా, గాంధీనగర్‌ టి జంక్షన్‌, డీబీఆర్‌ మిల్స్‌, ఇందిరాపార్క్‌, దోమలగూడ మీదుగా వెళ్ళాలి. ఖైరతాబాద్‌, పంజగుట్ట వైపు వెళ్ళాల్సిన వారు రాణిగంజ్‌, నల్లగుట్ట, సంజీవయ్యపార్క్‌, నెక్లెస్‌రోడ్‌, ఖైరతాబాద్‌ ఫ్లైవర్‌ మార్గాన్ని అనుసరించాలి. 
– ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను ఎన్టీఆర్‌ మార్గ్‌లోకి అనుమతించరు. వీటిని నెక్లెస్‌ రోడ్‌ లేదా మింట్‌ కాంపౌండ్‌ వైపు పంపిస్తారు. 
-తెలుగుతల్లి విగ్రహం జంక్షన్‌ నుంచి సాధారణ వాహనాలను ఎన్టీఆర్‌ మార్గ్‌లోకి అనుమతించరు. వీటిని ఇక్బాల్‌ మీనార్‌ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ దేవాలయం, డీబీఆర్‌ మిల్స్‌, చిల్డ్రన్స్‌ పార్క్‌, సెయిలింగ్‌ క్లబ్‌, కర్బాలా మైదాన్‌ మీదుగా మళ్లిస్తారు. 
– గోశాల వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్ళే వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా పంపిస్తారు. 
12వ తేదీన జరగనున్న గణేశ్‌ నిమజ్జనం కోసం గ్రేటర్‌లో గతంలో నిర్మించిన 23 కొలనులను శుభ్రపర్చడంతోపాటు మరో మూడు నూతన కొలనులను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ విగ్రహాల నిమజ్జనంతో జల వనరులు కలుషితంగా మారుతున్న నేపథ్యంలో.. చెరువుల్లో నిమజ్జనం కోసం రెండు దశల్లో 25, మూడో దశలో మరో కొలను నిర్మాణం పూర్తి చేశారు. వీటి నిర్మాణం కోసం రూ.21.89 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో కొలనులో ఐదు వేల విగ్రహాలు నిమజ్జనం చేయవచ్చని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. సఫిల్‌గూడలో నిమజ్జన ఏర్పాట్లను బుధవారం కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ పరిశీలించారు. కొలనులను శుభ్రం చేసి నీటిని నింపాలని, పారిశుధ్య నిర్వహణ, దీపాల ఏర్పాటు వంటి వాటిపై ప్రత్యేక ద ష్టి సారించాలని సూచించారు. 
పూర్తయిన కొలనులు… 
ఊరచెరువు – కాప్రా – చర్లపల్లి ట్యాంక్‌, అంబీర్‌ చెరువు- కూకట్‌పల్లి, పెద్ద చెరువు – గంగారం, శేరిలింగంపల్లి, వెన్నెల చెరువు- జీడిమెట్ల, రంగధామునికుంట – కూకట్‌పల్లి- 
మల్కం చెరువు, రాయదుర్గం-నల్లగండ్ల చెరువు, పెద్ద చెరువు-మన్సూరాబాద్‌, సరూర్‌నగర్‌ 
-హుస్సేన్‌సాగర్‌ పెద్ద చెరువు, నెక్నాంపూర్‌-లింగం చెరువు, సూరారం-ముళ్లకత్వ చెరువు , మూసాపేట-నాగోల్‌ చెరువు, కొత్త చెరువు – అల్వాల్‌, నల్ల చెరువు – ఉప్పల్‌, పత్తికుంట – రాజేంద్రనగర్‌, బోయిన్‌చెరువు – హస్మత్‌పేట, గురునాథ్‌ చెరువు – మియాపూర్‌, గోపి చెరువు – లింగంపల్లి, రాయసముద్రం చెరువు – రామచంద్రాపురం, కైదమ్మకుంట – హఫీజ్‌పేట, దుర్గం చెరువు – రాయదుర్గం 
కొత్తగా అందుబాటులోకి రానున్నవి… 
సాకి చెరువు – పటాన్‌చెరు, హుస్సేన్‌సాగర్‌ (అంబేడ్కర్‌ నగర్‌ వద్ద), బండ చెరువు – మల్కాజిగిరి. 
మహానగరంలో పదకొండు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈసారి హుస్సేన్‌సాగర్‌లో మొట్టమొదటి సారి ప్రభుత్వం తరపున గంగ హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ వెల్లడించారు. శుక్రవారం గణేష్‌ నిమజ్జనంపై మంత్రులు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి, నగర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ నగరంలో గణేష్‌ ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆనందోత్సవాలకు ప్రతీకగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు, భక్తులు కూడా ఈ ఉత్సవాలు ఘనంగా, ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం, పోలీసులతో సహకరించాలని సూచించారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కోసం ఈసారి ప్రత్యేకంగా 26 కొలనులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు శివారుల్లో నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాల్లో దాదాపు 255 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ వద్ద 20 బోట్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం వత్తిడిని తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో 22.89 కోట్ల రూపాయల ఖర్చుతో 26 నిమజ్జన కొలనులను చేపట్టగా, అందులో 23 పూర్తయ్యాయని, మరో మూడు నిర్మాణంలో ఉన్నాయని, ఒక్కోక్క కొలనులో ఐదువేల విగ్రహాల వరకు నిమజ్జనం చేసే అవకాశముందని మంత్రి వివరించారు. నిమజ్జనం జరిగే రూట్‌లో, వివిధ ప్రాంతాల్లో ఎప్పటికపుడు వ్యర్థాలను తొలగించేందుకు వీలుగా సుమారు 9710 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించి, 680 మంది జవాన్లతో ఈ పనులను ఎప్పటికపుడు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో జరిగే గణేష్‌ ఉత్సవాలకు దేశంలోనే ఎంతో గుర్తింపు ఉందని, ఇలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుక వీలుగా నగరంలోని హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో రౌండ్‌ ది క్లాక్‌ విధులు నిర్వర్తించనున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా బ్యారికేడ్లు, అదనంగా లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులతో పాటు రిజర్వ్‌డ్‌ పోలీసులను రంగంలో దింపనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం 30లక్షల పై చిలుకు వాటర్‌ ప్యాకెట్లను 115 కౌంటర్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఆర్టీసీ, మెట్రోరైలు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, స్టీఫెన్‌సన్‌, ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, శేరిసుభాష్‌ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జీఏడీ ప్రత్యేక కార్యదర్శి అదర్‌సిన్హా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌, పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్‌, మహేశ్‌ భగవత్‌, అదనపు కమిషనర్‌ జితేందర్‌, హైదరాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవి, రంగారెడ్డి జేసీ లోకేశ్‌, మెడ్చల్‌ జేసీ రవి, మెట్రోరైలు ఎండీ డా.ఎన్వీఎస్‌ రెడ్డి పాల్గొన్నారు.