అరెస్టయ్యారు.. మంచిదే

చిదంబరం కస్టడీపై ఇంద్రాణీ ముఖర్జియా వ్యాఖ్యలు 

ముంబయి: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అరెస్టు వ్యవహారంపై ఐఎన్‌ఎక్స్‌ మీడియా సహవ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జియా స్పందించారు. ఆయన అరెస్టు కావడం శుభవార్తే అని వ్యాఖ్యానించారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణీని నేడు ట్రయిల్‌ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ”చిదంబరం అరెస్టు కావడం శుభవార్త. ఆయనను అన్ని వైపుల నుంచి కట్టడి చేశారు. ఇదే కేసులో కార్తీ చిదంబరానికి మంజూరైన బెయిల్‌ కూడా రద్దు కావాలి” అని వ్యాఖ్యానించారు. 
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని సీబీఐ అధికారులు ఈ నెల 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) ద్వారా నిధుల్ని మళ్లించేందుకు బదులుగా తన కుమారుడు కార్తీ చిదంబరానికి సహాయం చేయాలని చిదంబరం తనను, తన భర్త పీటర్‌ ముఖర్జియాను కోరినట్టు ఇంద్రాణీ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అలాగే, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అప్రూవర్‌గా మారేందుకు ఇంద్రాణీ ముఖర్జియాను ప్రత్యేక కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్నే కీలక ఆధారంగా చేసుకొని సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్టుచేశారు.