కశ్మీర్‌ మన అంతర్గత విషయం

లోయలో హింసకు కారణం పాకిస్థానే: రాహుల్‌ 

న్యూఢిల్లీ: కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత అంతర్గత విషయమని, ఇందులో పాకిస్థాన్‌ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై గతకొంతకాలంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న రాహుల్‌.. తాజాగా ఇదే కశ్మీర్‌ అంశంపై ప్రభుత్వానికి మద్దతిస్తూ మాట్లాడటం విశేషం. ‘చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యలను నేను వ్యతిరేకించాను. కానీ ఈ విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. కశ్మీర్‌ భారత అంతర్గత విషయం. ఇందులో పాకిస్థాన్‌ లేదా ఇతర ఏ దేశమైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. జమ్ముకశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌ మద్దతు, ప్రేరణ వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతిచ్చే ప్రధాన దేశం పాకిస్థాన్‌ అని తెలిసిందే కదా’ అని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇటీవల కశ్మీర్‌లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు రాహుల్‌ సహా విపక్ష నేతల బందం శ్రీనగర్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భద్రతాకారణాల ద ష్ట్యా వారిని ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించారు. కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గత కొన్నిరోజులుగా విమర్శలు చేస్తున్న రాహుల్‌.. తాజాగా ఇలాంటి ట్వీట్లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌ ట్వీట్‌కు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ‘కాంగ్రెస్‌ ఎప్పటినుంచో చెబుతున్నది ఇదే. జమ్ముకశ్మీర్‌ భారత అంతర్గత భాగం. ఆర్టికల్‌ 370 రద్దు ప్రక్రియను మేం వ్యతిరేకించాం. ఎందుకంటే అది రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువను దెబ్బతీసేలా ఉంది. అంతేగానీ.. కశ్మీర్‌ అంశానికి మేం వ్యతిరేకం కాదు’ అని థరూర్‌ పేర్కొన్నారు.